మహా ఆక్సిజనీకరణ ఘటన
From Wikipedia, the free encyclopedia
భూమి పుట్టినపుడు అక్కడ వాతావరణం లేదు. వాతావరణం ఏర్పడినపుడు అందులో ఆక్సిజన్ దాదాపుగా లేదు. అనేక కోట్ల సంవత్సరాల తరువాత వాతావరణం లోకి ఆక్సిజన్ చేరడం జరిగింది. జీవసంబంధ చర్యల ద్వారా భూ వాతావరణంలోకి పెద్దయెత్తున ఆక్సిజన్ చేరడాన్ని మహా ఆక్సిజనీకరణ ఘటన అంటారు. ఈ ఘటన ప్రారంభాన్ని మహా ఆక్సీకరణ ఘటన అని (GOE అని, ఆక్సిజన్ మహావిపత్తు అని, ఆక్సిజన్ సంక్షోభం అని, ఆక్సిజన్ మారణహోమం అని,[2] ఆక్సిజన్ విప్లవం అని, మహా ఆక్సీకరణం అనీ) శాస్త్ర వైజ్ఞానిక మీడియాలో అంటారు.[3] భూవైజ్ఞానిక, ఐసోటోపిక్, రసాయనిక ఋజువుల ప్రకారం ఈ మహా వాతావరణ మార్పు 245 కోట్ల సంవత్సరాల కిందట (2.45 బి.సం.క్రి.) సైడీరియన్ పీరియడ్లో, ప్రోటెరోజోయిక్ ఇయాన్ ప్రారంభంలో జరిగింది[4]. ఆక్సీకరణ ఘటన కారణంగా అప్పట్లో విలసిల్లిన ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి. ఈ ఘటనకు కారణాలేంటో స్పష్టంగా తెలీదు.[5]
230 కోట్ల సంవత్సరాల కిందట మాక్రోస్కోపిక్ రూపంలోకి మారిన సముద్రంలోని సయనోబ్యాక్టీరియా (ఆక్సీకరణ ఘటనకు సుమారు 20 కోట్ల సంవత్సరాల ముందు),[6] కిరణజన్యుసంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన తొట్టతొలి మైక్రోబ్లని భావిస్తున్నారు.[7]
సయనోబ్యాక్టీరియా ఆక్సిజన్ను ఉత్పత్తి చెయ్యగానే ఈ ఘటన మొదలు కాలేదు. ముందు ఉత్పత్తి అయిన అక్సిజన్ను సముద్రంలోని ఇనుము, ఆర్గానిక్ పదార్థం వగైరాలు కరిగించేసుకున్నాయి. ఆ విధంగా ఐరన్ ఆక్సైడు తయారైంది. ఈ ఆక్సిజన్ భోక్తలు ఆక్సిజన్తో సంతృప్తమయ్యాక, సయనోబ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదల అవడం మొదలై, మహా ఆక్సీకరణ ఘటనకు దారితీసింది. ఆక్సిజన్ ఉత్పత్తిలో పెరుగుదల భూమి వాతావరణ సమతుల్యతను ఛేదించింది.[8] ఆబ్లిగేట్ ఎనరోబిక్ జీవులకు ఆక్సిజన్ విషతుల్యం. ఆక్సిజన్ పెరుగుదల అటువంటి జీవరాశులను చాలావరకు నాశనం చేసి ఉండవచ్చు. కాబట్టి భూమి చరిత్రలో అత్యంత ప్రముఖమైన మహావినాశనాల్లో ఒకదానికి సయనోబ్యాక్టీరియా కారణమైంది. సముద్రంలోని సయనోబ్యాక్టీరియాతో పాటు నేలపై కూడా సయనోబ్యాక్టీరియా ఉన్నట్టు ఋజువులున్నాయి.
కొంత కాలానికి, ఆక్సిజన్ను గ్రహించి జీవించే ఏరోబిక్ జీవరాశులు ఉద్భవించి అభివృద్ధి చెందడంతో వాతవరణంలో ఆక్సిజన్ సమతుల్యతా స్థాయికి చేరింది. అప్పటి నుండి వాతావరణంలో స్వేచ్ఛా ఆక్సిజన్ ఒక ప్రధాన భాగమైపోయింది.[9]