మక్ఖలి గోశాలుడు
From Wikipedia, the free encyclopedia
క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో మక్ఖలి గోశాలుడు ప్రసిద్దుడు. అజీవక మత శాఖను స్థాపించినవాడుగా ఇతనిని పేర్కొంటారు. బౌద్ద గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు. ఇతను మహావీరుని, గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు. ఇతనిని జైన బౌద్ద మతాలు ప్రమాదకరమైన ప్రత్యర్థిగా గుర్తించాయి. బౌద్ద మతం కొంతవరకు సమకాలికుల చేత సమ్మానితుడైన దార్శనికుడుగా గుర్తిస్తే, జైన మతం మాత్రం మక్ఖలి గోశాలుని జైన మతానికి ప్రబల విరోధిగా పరిగణించి అతనిని, అతను స్థాపించిన అజీవక మత శాఖను చివరివరకూ ద్వేషించింది.