నారంగ కాలేయవ్యాధి
From Wikipedia, the free encyclopedia
కాలేయములో కాలేయ కణాల విధ్వంసం, కొత్త కణాల పునరుత్పత్తి, కణాల విధ్వంసం పిదప తంతుకణాలు (ఫైబ్రోబ్లాస్ట్స్) కలిగించే తంతీకరణం ( పీచువంటి పదార్థం ఏర్పడుట ) జరుగుట వలన కాలేయంలో బుడిపెలు ఏర్పడి నారంగ కాలేయవ్యాధికి (సిర్రోసిస్ ఆఫ్ లివర్) వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి అంతిమ దశలలో కాలేయపు పనితీరు బాగా క్షీణించి పచ్చకామెరలు కలుగడం వలన దేహం, కాలేయం నారింజపండు రంగులో పచ్చగా మారుతాయి. అందు వలన ఈ వ్యాధి నారంగ కాలేయవ్యాధి [1] [2](సిర్రోసిస్ ఆఫ్ లివర్); Greek kirrh (ós) orange-tawny + - osis ) అని పేరు పొందింది. నారంగ కాలేయవ్యాధి ఇతర రోగాల పర్యవసానం వలన కలిగే దీర్ఘకాలపు వ్యాధి.
ఆరంభదశలో లక్షణాలు కనిపించవు కాని వ్యాధి ముదిరిన పిదప కాలేయపు పనితనం మందగించడం వలన, ద్వారసిరలో (పోర్టల్ వీన్) రక్తపీడనం పెరగడం వలన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.ఈ వ్యాధిగ్రస్థులు జలోదరంతో ఎత్తైన బూర పొట్టతో, శరీరం నారింజపండు రంగుతో అంత్యదశలలో కనిపిస్తారు.