![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f4/Chandrayaan-2_lander_and_orbiter_integrated_module.jpg/640px-Chandrayaan-2_lander_and_orbiter_integrated_module.jpg&w=640&q=50)
చంద్రయాన్-2
చంద్రునిపైకి భారత్ చేసిన రెండవ యాత్ర / From Wikipedia, the free encyclopedia
చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్వి ఎమ్కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర.
![]() ల్యాండరు, ఆర్బిటరును అనుసంధించాక | |
సంస్థ | ఇస్రో |
---|---|
మిషన్ రకం | ఆర్బిటరు, విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవరు |
దీనికి ఉపగ్రహం | చంద్రుడు |
లాంచ్ తేదీ | 2019 జూలై 22 |
లాంచ్ వాహనం | జిఎస్ఎల్వి ఎమ్కె3 |
మిషన్ వ్యవధి | ఆర్బిటరు: 1 సంవత్సరం; ల్యాండరు, రోవరు: 14 రోజులు |
హోమ్ పేజి | https://www.isro.gov.in/chandrayaan2-home-0 |
ద్రవ్యరాశి | మొత్తం (ఇంధనంతో): 3,850 కి.గ్రా.[1][2][3] మొత్తం (ఇంధనం లేకుండా): 1,308 కి.గ్రా.[4] ఆర్బిటరు (ఇంధనంతో): 2,379 కి.గ్రా.[2][3] ఆర్బిటరు (ఇంధనం లేకుండా): 682 కి.గ్రా.[4] విక్రమ్ ల్యాండరు (ఇంధనంతో): 1,471 కి.గ్రా.[2][3] విక్రమ్ ల్యాండరు (ఇంధనం లేకుండా): 626 కి.గ్రా.[4] ప్రజ్ఞాన్ రోవరు: 27 కి.గ్రా.[2][3] |
సామర్థ్యం | ఆర్బిటరు: 1 కి.వా.[5]
విక్రమ్ ల్యాండరు: 650 వా ప్రజ్ఞాన్ రోవరు: 50 వా |
చంద్రయాన్-2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ[6][7] ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండరుకు అందజేయగా అది భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్వర్కుకు చేరవేస్తుంది.[8] చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది.
ఇస్రో రూపకల్పన ప్రకారం - ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది. దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేస్తుంది. 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) అది పరీక్షలు జరుపుతుంది. ఆర్బిటరు చంద్రకక్ష్యలో సంవత్సరం పాటు పనిచేస్తుంది.
మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు.[9] క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్ఎల్వి ఎమ్కె3 ఎమ్1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.[10]
భూకక్ష్యలో ఉండగా కక్ష్యను పెంచడానికి, ఆ తరువాత భూకక్ష్య నుండి చంద్రుని బదిలీ కక్ష్యలోకి చేర్చేందుకు, చంద్ర కక్ష్యలో ఉండగా కక్ష్య తగ్గించేందుకూ ఇస్రో అనేక విన్యాసాలను జరిపింది. ఆర్బిటరు లోని ద్రవ ఇంధన ఇంజన్లను ఇందుకు వినియోగించారు.
చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా, దానికి భూమితో సంపర్కం తెగిపోయింది. ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో తెలిపింది.[11]