కన్హేరీ గుహలు
ముంబైలోని కన్హేరీలో బౌద్ధ గుహాలయాలు / From Wikipedia, the free encyclopedia
కన్హేరీ గుహలు లేదా కాన్హేరీ గుహలు ఒకప్పటి సాల్శెత్ ద్వీపాలైన నేటి ముంబాయి నగర పశ్చిమ శివారు బోరీవలీలోని సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలోనున్న కన్హేరీ అను కొండలోని బౌద్ధ గుహాలయాలు (మానవ నిర్మిత గుహలు). కన్హేరీలు శిలాద్రవపు కొండలు కాగా, వాటి చుట్టుపక్కనున్న కొండలు బసల్ట్ కొండలు.[1] సంఖ్యాపరంగా ఒక కొండలో తవ్వబడ్డ అత్యాధిక గుహలు కన్హేరీ గుహలు.[2]
కన్హేరి గుహలు | |
---|---|
కాన్హేరి గుహలు | |
చైత్యంలో స్థూపము. మూడో గుహ. | |
స్థలం | సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం |
అక్షాంశ రేఖాంశాలు | 19°12′30″N 72°54′23″E |
Geology | బసాల్టు |
Entrances | >110 |
కొండలలోనున్న ఈ గుహలను రాళ్ళను తొలిచి చెక్కిన మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఇవి మొత్తం 110 గుహలకు పైబడి ఉన్నాయి.[3] ఈ గుహ వర్గమందు చాల గుహలందు శిల్పవాస్తుప్రదర్శన ఏమియు కనబడదు. నిర్ణయక్రమము రీతిగాని వీటియందు కనబడదు. రాతిని మలచిన గూండ్లవలె ఉండును. వీటి నిర్మాణాలు సా.శ.పూ 3వ శతాబ్దిలో మొదలవ్వగా,[2] సా.శ 1వ శతాబ్ది నుండి 10వ శతాబ్ది వరకు జరిగాయి. మూడవ శతాబ్ది నాటికల్లా ఇవి ముఖ్యమైన బౌద్ధ కేంద్రాలుగా ఎదిగాయి.[4] 16వ శతాబ్ది నాటి పోర్చుగీసూ, ఇతర ఐరోపా పర్యటకుల యాత్రా చరిత్రల్లో వీటి ప్రస్తావన ఉంది.[2] ఇచట అనేక గుహలు, మరల మరల మార్పులు చెంది, తొలిరూపము తెలియకుండా మార్పు చెందినవి. ఈ గుహలందు బ్రాహ్మీలిపి శాసనములు అనేకము ఉన్నాయి. ఆంధ్రశాతకర్ణి రాజుల చరిత్ర ఇచట చాలావరకు లిఖితమయి ఉన్నదని పండితుల అభిప్రాయము.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Kanheri_caves_map.jpg/640px-Kanheri_caves_map.jpg)
మొదట చెక్కిన గుహలు పెద్దగా అలంకరణ లేకుండా మామూలుగా ఉండగా, తరువాతి గుహల్లో శిల్పకళా, ఇతర ఆడంబరాలూ కనిపిస్తాయి.
ఈ గుహలు రెండు రకాలు. ఒకటి- చైత్యాలు. చైత్యాలు భిక్షువుల ప్రార్థనా స్థలాలు. వీటిలో శిల్పాలూ, స్థూపాలూ చెక్కబడి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది అవలోకితేశ్వరుడి శిల్పం. రెండో రకం- విహారాలు. ఇవి చైత్యాలకంటే చిన్నవి కానీ వీటి సంఖ్య ఎక్కువ. విహారాలు భిక్షువుల నివాస స్థలాలు. ఈ విహారాలను బట్టి, ఇక్కడ చాలా మంది భిక్షువులు ఉండేవారని తెలుస్తోంది.
ఈ గుహలయాలకు అక్కడి ఇతర రేవు పట్టణాలైన సోపారా, కల్యాణ్, నాశిక్, పైఠణ్, ఉజ్జయినీలతో సంబంధాలుండేవి. మౌర్యులూ, కుషాణుల కాలానికి కన్హేరి విశ్వవిద్యాలయంగా ఉండేది.[5] 10వ శతాబ్ది చివరలో బౌద్ధ పండితుడూ, భిక్షువూ ఐన అతిశా (980–1054), బౌద్ధ ధ్యానం గురించి రాహులగుప్తుడి నుండి నేర్చుకునేందుకు కృష్ణగిరి విహారానికి వచ్చాడు.[6]