ఓజోన్ క్షీణత
భూమి స్ట్రాటోస్ఫియరులో జరిగే ప్రక్రియ / From Wikipedia, the free encyclopedia
సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. [1] ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
“Whatever Happened to the Ozone Hole?”, Distillations Podcast Episode 230, April 17, 2018, Science History Institute |
"ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది. [2] [3]
ఓజోన్ క్షీణతకు, ఓజోన్ రంధ్రం ఏర్పడడానికీ ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు - ముఖ్యంగా హేలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, ద్రావకాలు, చాలకాలు, క్లోరోఫ్లూరోకార్బన్లు (CFC లు), హేలోన్లు HCFC లు. వీటిని ఓజోన్ హారక పదార్థాలు (ODS) అని అంటారు. ఈ సమ్మేళనాలు ఉపరితలం నుండి విడుదలైన తరువాత టర్బ్యులెంట్ మిక్సింగు ద్వారా అణువులు స్థిరత్వం పొందే వేగం కంటే చాలా వేగంగా కలసి పోయి, స్ట్రాటోస్ఫియరు లోకి రవాణా అవుతాయి. [4] స్ట్రాటోస్ఫియరు లోకి చేరాక, కాంతివిశ్లేషణం (ఫోటో డిస్సోసియేషను) ప్రక్రియ ద్వారా అవి హేలోజన్ అణువులను విడుదల చేస్తాయి. ఇవి ఉత్ప్రేరకంగా పనిచేసి, ఓజోన్ (O3) ను ఆక్సిజన్ (O2) గా మారుస్తాయి.
ఓజోన్ క్షీణత కారణంగా క్యాన్సరు వాటిల్లే ప్రమాదం పెరగడం పట్ల, ఇతర ప్రతికూల ప్రభావాల పట్లా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను భూ వాతావరణం గుండా చొచ్చుకుని రాకుండా నిరోధిస్తుంది. ఈ కిరణాలు చర్మ క్యాన్సరుకు, వడదెబ్బకు, కంటిశుక్లానికీ కారణమవుతాయి. అలాగే మొక్కలు. జంతువులకు హాని కలిగిస్తాయి. ఓజోన్ పొర పల్చబడటం వలన ఈ కిరణాలు నాటకీయంగా పెరుగుతాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో 1987 లో ప్రపంచదేశాలన్నీ మాంట్రియల్ ప్రోటోకోల్ను అమలు చెయ్యాలని తీర్మానించాయి. ఈ ప్రోటోకోల్ CFC లు, హేలోన్లు, ఇతర ఓజోన్-హారక రసాయనాల ఉత్పత్తిని నిషేధించింది.
ఈ నిషేధం 1989 లో అమల్లోకి వచ్చింది. 1990 ల మధ్యలో ఓజోన్ స్థాయి తగ్గకుండా నిలబడిపోయింది. 2000 లలో ఓజోన్ పొర పుంజుకోవడం మొదలైంది. ఈ పుంజుకోవడం 21 వ శతాబ్ది లోనూ కొనసాగి, 2075 నాటికి ఓజోన్ రంధ్రం 1980 పూర్వం నాటి స్థాయికి చేరుకుంటుందని అంచనా. [5] మాంట్రియల్ ప్రోటోకోల్ను ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా భావిస్తారు. [6] [7]