![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Salt_March.jpg/640px-Salt_March.jpg&w=640&q=50)
ఉప్పు సత్యాగ్రహం
మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమం / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చి అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించాడు.[1] రోజురోజుకూ పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి, 24 రోజుల తరువాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6 న, ఉదయం 6:30 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది.[2]
![]() యాత్ర అంతాన గాంధీ, ఉప్పు గల్లును పట్టుకున్నాడు. అతని వెనక రెండవ కుమారుడు మణిలాల్ గాంధీ, మైథుబెన్ పెటిట్ ఉన్నారు. | |
తేదీ | 12 మార్చి 1930 - 1930 ఏప్రిల్ 5 |
---|---|
ప్రదేశం | సబర్మతి, అహ్మదాబాదు, గుజరాత్ |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/Marche_sel.jpg/640px-Marche_sel.jpg)
దండి వద్ద ఉప్పు వండిన తరువాత గాంధీ, తీరం వెంబడి దక్షిణ దిశగా కొనసాగి, ఉప్పు తయారు చేస్తూ, మార్గంలో సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వెళ్ళాడు. దండికి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరసానా సాల్ట్ వర్క్స్ వద్ద సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక వేసింది. అయితే, ఈ సత్యాగ్రహానికి కొద్ది రోజుల ముందు, 1930 మే 4–5 అర్ధరాత్రి గాంధీని అరెస్టు చేశారు. దండి సత్యాగ్రహం, ఆ తరువాత ధరసానా సత్యాగ్రహాలకు వార్తాపత్రికల్లోను, న్యూస్రీల్ల ద్వారానూ వచ్చిన విస్తృతమైన ప్రచారంతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. గాంధీ జైలు నుండి విడుదల కావడం, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్తో చర్చలు జరిగడంతో ఉద్యమం ముగిసింది.[3] ఉప్పు సత్యాగ్రహం ఫలితంగా 60,000 మంది భారతీయులు జైలు పాలైనప్పటికీ,[4] బ్రిటిషు వారు వెంటనే పెద్ద రాయితీలేమీ ఇవ్వలేదు.[5]
ఉప్పు సత్యాగ్రహ ప్రచారం గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ సూత్రాలపై ఆధారపడింది.1930 ప్రారంభంలో, బ్రిటిషు పాలన నుండి భారత సార్వభౌమత్వాన్ని, స్వయం పాలననూ సాధించుకోవటానికి భారత జాతీయ కాంగ్రెస్, తన ప్రధాన వ్యూహంగా సత్యాగ్రహాన్ని ఎంచుకుంది. ప్రచారాన్ని నిర్వహించడానికి గాంధీని నియమించింది. 1882 బ్రిటిషు ఉప్పు చట్టాన్ని గాంధీ తమ సత్యాగ్రహ మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు. దండికి పాదయాత్ర, ధరసానాలో వందలాది అహింసా నిరసనకారులను బ్రిటిషు పోలీసులు కొట్టడం వంటి సంఘటనలు సామాజిక రాజకీయ అన్యాయాలపై పోరాటంలో శాసనోల్లంఘనను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రదర్శించాయి.[6]
గాంధీ సత్యాగ్రహ బోధనలు, దండి యాత్రలు 1960 లలో ఆఫ్రికన్ అమెరికన్లు, ఇతర మైనారిటీ వర్గాల పౌర హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తలైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జేమ్స్ బెవెల్ తదితరులపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 1920-22 నాటి సహాయ నిరాకరణోద్యమం తరువాత ఈ మార్చి బ్రిటిషు అధికారానికి అత్యంత ముఖ్యమైన వ్యవస్థీకృత సవాలు విసిరింది. 1930 జనవరి 26 న భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య నినాదం ప్రకటించిన వెంటనే దండి సత్యాగ్రహం మొదలైంది.[7] ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది.