ఆజాద్ హింద్ ఫౌజ్
రెండవ ప్రపంచయుద్ధంలో ఏక్సిస్ వర్గంపై పోరాడే స్వతంత్ర్య భారత సైన్యం / From Wikipedia, the free encyclopedia
ఆజాద్ హింద్ ఫౌజ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో 1942 సెప్టెంబరు 1 న భారతీయ స్వాతంత్ర్య యోధులు, జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం దీని లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధపు ఆగ్నేయాసియా యుద్ధరంగంలో జరిగిన యుద్ధంలో ఇది జపాను సైనికులతో కలిసి పోరాడింది.[1] ఈ సైన్యాన్ని మొదట 1942 లో రాస్ బిహారి బోస్ నేతృత్వంలో భారతీయ యుద్ధ ఖైదీలు స్థాపించారు. ఈ యుద్ధఖైదీలు, మలయా, సింగపూర్ యుద్ధాల్లో జపాను వారు పట్టుకున్న బ్రిటిషు భారతీయ సైన్యానికి చెందిన సైనికులు.[2] ఆసియాలో జరిగిన యుద్ధంలో జపాను పాత్రపై ఫౌజు నాయకత్వానికి, జపాను మిలిటరీకీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ మొదటి ఫౌజు కూలిపోయింది. అదే సంవత్సరం డిసెంబరులో దాన్ని రద్దు చేసారు. రాష్ బిహారీ బోసు ఫౌజును సుభాష్ చంద్రబోసుకు అప్పగించాడు.[3] 1943 లో ఆగ్నేయాసియాకు వచ్చిన సుభాష్ చంద్రబోసు, దీన్ని పునరుద్ధరించాడు. సైన్యం బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సైన్యంగా ప్రకటించారు.[4] నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, తన పేరు మీదుగా INA బ్రిగేడ్లు/రెజిమెంట్లకు పేర్లు పెట్టాడు.[5] ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద ఒక మహిళా రెజిమెంటును కూడా నెలకొల్పాడు. బోసు నాయకత్వంలో, మలయా (ప్రస్తుత మలేషియా), బర్మాలోని భారతీయ ప్రవాస జనాభా నుండి వేలాది మంది పౌర వాలంటీర్లు, మాజీ ఖైదీలూ ఫౌజులో చేరారు.[6] ఈ రెండవ INA బ్రిటిషు, కామన్వెల్త్ దళాలకు వ్యతిరేకంగా ఇంపీరియల్ జపాను సైన్యంతో కలిసి బర్మాలో జరిగిన యుద్ధాల్లో పోరాడింది. తొలుత ఇంఫాల్, కోహిమాల్లోను, ఆ తరువాత మిత్రరాజ్యాలు బర్మాను తిరిగి స్వాధీనం చేసుకున్నపుడు వారికి వ్యతిరేకంగానూ పోరాడింది.
ఆజాద్ హింద్ ఫౌజ్ Indian National Army | |
---|---|
ఆజాద్ హింద్ ఫౌజ్ | |
క్రియాశీలకం | 1942 ఆగస్టు - 1945 సెప్టెంబరు |
దేశం | Azad Hind (1943 అక్టోబరు తరువాత) |
పాత్ర | గెరిల్లా, పదాతిదళం , ప్రత్యేక కార్యకలాపాలు |
పరిమాణం | 43,000; రెజిమెంట్లు: గాంధీ బ్రిగేడ్ , నెహ్రూ బ్రిగేడ్, ఆజాద్ బ్రిగేడ్, సుభాష్ బ్రిగేడ్, రాణీ ఆఫ్ ఝాన్సీ రెజిమెంటు |
నినాదం | ఇతెహాద్, ఇత్మద్ ఔర్ ఖుర్బానీ (ఉర్దూ: ఐక్యత, విశ్వాసం, త్యాగం) |
పాదయాత్ర | కదం కదం బడాయే జా |
కార్యకలాపాలు | రెండవ ప్రపంచ యుద్ధం
|
కమాండర్స్ | |
కమాండర్-ఇన్-ఛీఫ్ | మోహన్ సింగ్ (జనరల్) (1942) సుభాష్ చంద్ర బోస్ (1943-1945) |
ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ | జగన్నాథ్ రావు భోంస్లే |
ప్రసిద్ధ కమాండర్లు | మొహమ్మద్ జమాన్ కియానీ షా నవాజ్ ఖాన్ (జనరల్) ప్రేమ్ సహగల్ గురుబక్ష్ సింగ్ డిల్లాన్ |
1942 లో మొదటిసారి INA ఏర్పడినప్పుడు, మరింతమంది భారత సైనికులు ఫిరాయిస్తారనే ఆందోళన బ్రిటిషు భారతీయ సైన్యానికి ఉండేది. సిపాయి విధేయతను కాపాడటానికి రిపోర్టింగ్ నిషేధాన్ని, "జిఫ్స్" అనే ప్రచారాన్నీ మొదలుపెట్టారు. సైన్యం గురించి రాసిన పీటర్ డబ్ల్యూ.ఫే వంటి చరిత్రకారులు, యుద్ధంలో ఐఎన్ఎ గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని భావిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత చాలా మంది సైనికులను భారతదేశానికి పంపి, అక్కడ కొందరిపై దేశద్రోహం కేసులు పెట్టి విచారణ చేసారు. ఈ విచారణలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరేపకాలుగా మారాయి. 1946 లో రాయల్ ఇండియన్ నేవీలో బాంబే తిరుగుబాటు, ఇతర తిరుగుబాట్లూ ఈ INA విచారణల నుండి ఉద్భవించిన జాతీయవాద భావాల వల్లనే సంభవించినట్లు భావిస్తున్నారు. సుమిత్ సర్కార్, పీటర్ కోహెన్, ఫే తదితర చరిత్రకారులు -ఈ సంఘటనలు బ్రిటిషు పాలన ముగింపును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలో INA లో పనిచేసిన అనేక మంది వ్యక్తులు భారతదేశంలోను ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలలోనూ, ప్రజా జీవితంలో ప్రముఖమైన స్థానాల్లోకి ఎదిగారు. ముఖ్యంగా భారతదేశంలో లక్ష్మీ సెహగల్, మలయాళో జాన్ తివి, జానకి అత్తినహప్పన్.
ఇది ఇంపీరియల్ జపాను తోటి, ఇతర అక్షరాజ్యాల తోటీ ముడిపడి ఉంది. జపాన్ చేసిన యుద్ధ నేరాలలో పాలుపంచుకున్నట్లు ఐఎన్ఎ దళాలపై ఆరోపణలు వచ్చాయి.[7] బ్రిటిషు సైనికులు, సైన్యంలో చేరని భారతీయ యుద్ధఖైదీలూ INA సభ్యులను అక్షరాజ్యాల సహకారులుగా భావించారు.[8] కానీ యుద్ధం తర్వాత వారిని చాలా మంది భారతీయులు దేశభక్తులుగా చూసారు. భారత స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారత జాతీయ కాంగ్రెస్ వారిని స్మరించుకున్నప్పటికీ, భారత ప్రభుత్వం అహింసా ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల హోదాను INA సభ్యులకు ఇవ్వడానికి నిరాకరించింది. ఐతే, ఫౌజు మాత్రం భారతీయ సంస్కృతి, రాజకీయాలలో ఒక ప్రముఖమైన ఉద్వేగభరితమైన అంశంగా నిలిచిపోయింది.[6][8][9]