అజీవకులు
From Wikipedia, the free encyclopedia
క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన అవైదిక మత శాఖలలో అజీవకమతం ప్రసిద్ధమైనది. భౌతికవాద దార్శనికుడైన మక్ఖలి గోశాలుడు అజీవక మతాన్ని స్థాపించాడు. అజీవక మతాన్ని అవలంబించే వారిని అజీవకులు అంటారు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు మక్ఖలి గోశాలుడు. ఇతను మహావీరుని, గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన అజీవక మతాన్ని తోటి అవైదిక మతాలైన జైన, బౌద్ధ మతాలు ప్రత్యర్థి మత శాఖ గానే గుర్తించి విమర్శించాయి. జైన బౌద్ధ మతాల వలె క్రీ.పూ. 6 వ శతాబ్దం లోనే వెలసిన ఈ అజీవక మతం మౌర్యసామ్రాజ్య కాలంలో ఉచ్చస్థితిలో వుండి తదనంతరకాలంలో క్షీణిస్తూ సా.శ. 14 వ శతాబ్దానికి తమిళ దేశంలో నామ మాత్రంగా ఉనికిని నిలబెట్టుకొంది.
అజీవక మత శాఖను స్థాపించినవాడుగా మక్ఖలి గోశాలుని పేర్కొంటారు. అయితే కొందరు గోశాలుడికి పూర్వమే అజీవక శాఖ ఉనికిలో వున్నదని నంద వచ్చ, కిశ సాంకిచ్చ (కృత సాంకృత్య) అనే ప్రచారకులు ఈ అజీవక శాఖకు ఆద్యులని, మక్ఖలి గోశాలుడు ఈ అజీవక శాఖకు చివరి తీర్ధంకరుడని అభిప్రాయ పడ్డారు.