2001–2002 భారత పాక్ ప్రతిష్ఠంభన
From Wikipedia, the free encyclopedia
2001-2002 భారతదేశం-పాకిస్తాన్ ప్రతిష్టంభన భారతదేశం, పాకిస్తాన్ మధ్య 2001 లో ఏర్పడిన సైనిక ప్రతిష్టంభన. దీనిలో భాగంగా సరిహద్దుకు ఇరువైపులా, కాశ్మీర్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి సైనికులను భారీగా మోహరించారు. 1998లో రెండు దేశాలు విజయవంతంగా అణ్వాయుధాలను పరీక్షించిన తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య ఇది రెండవ అతిపెద్ద సైనిక ప్రతిష్టంభన, మొదటిది 1999 నాటి కార్గిల్ యుద్ధం.
| ||||||||||||||||||||||||||||||||
2001 డిసెంబర్ 13 న ఢిల్లీలోని భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి (భవనంపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులతో సహా పన్నెండు మంది మరణించారు), 2001 అక్టోబరు 1 న జమ్మూ కాశ్మీర్ శాసనసభపై జరిగిన ఉగ్రవాద దాడికి (దీనిలో 38 మంది మరణించారు.) ప్రతిస్పందనగా భారతదేశం సైనిక బలగాల మోహరింపు మొదలుపెట్టింది.[9] కాశ్మీరులో పోరాడుతున్న రెండు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలు - లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ లు ఈ దాడులు చేసాయని భారతదేశం పేర్కొంది. ఈ రెండింటికి పాకిస్తాన్ ISI మద్దతు ఉందని భారతదేశం పేర్కొంది. ఆ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది.[10][11] పాకిస్తాన్లోని సరిహద్దుల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై యుద్ధం ప్రారంభించాలని అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా భారత్ను కోరాడు. [9]
పాశ్చాత్య మీడియాలో, రెండు దేశాల మధ్య అణుయుద్ధ సంభావ్యత, సమీపంలోని ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా నేతృత్వంలోని " గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం "పై దానివలమ్న కలిగే చిక్కులపైననే దృష్టి సారించింది. అంతర్జాతీయ దౌత్యపరమైన మధ్యవర్తిత్వం కారణంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి, దీని ఫలితంగా 2002 అక్టోబరులో భారత [12] పాకిస్తాన్లు అంతర్జాతీయ సరిహద్దు నుండి తమతమ దళాలను ఉపసంహరించుకున్నాయి.
సైనిక సమీకరణకు భారతీయ సంకేతనామం ఆపరేషన్ పరాక్రమ్, దీనిని NDTV కి చెందిన సంజయ్ అహిర్వాల్ పాకిస్తాన్తో భారతదేశపు "కన్నూ కన్నూ కలిపి ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం" గా అభివర్ణించాడు. భారత్ తన సైనిక, రాజకీయ లక్ష్యాలలో కొన్నింటిని సాధించుకున్న ఆపరేషను ఇది. [13]
సుదీర్ఘమైన ఈ సైనిక ప్రతిష్టంభన ముగింపు దశకు చేరే సమయంలో చేసిన ఒక రహస్య ఆపరేషనులో ద్రాస్ సమీపంలో, నియంత్రణ రేఖకు పాకిస్తాన్ వైపున వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత గల పర్వత శిఖరం పాయింట్ 5070 ని భారతదేశ జాట్ రెజిమెంటు ఆక్రమించింది. తదనంతరం దానికి బల్వాన్ అని పేరు పెట్టింది. [14][15][13] వేసవిలో ఈ శిఖరాన్ని ఆక్రమించడం అలవాటుగా ఉన్న పాకిస్తానీ సైన్యాన్ని ఇది చిక్కుల్లో పడేసింది. ఈ శిఖరారోహణంతో భారతదేశానికి, అక్కడి నుండి పాక్ వౌపున ఉన్న గుల్తారీ లోయను చక్కగా చూసే వీలు కల్పించింది. ఈ శిఖరాన్ని కోల్పోయినందుకు పర్యవసానంగా, పాకిస్తానీ బ్రిగేడ్ కమాండరు, ఉత్తర ప్రాంతాల కమాండింగు ఆఫీసరులతో సహా మొత్తం కమాండ్ గొలుసును పాకిస్తానీ సైన్యం తొలగించేసింది. ద్రాస్ సమీపంలోని సరిహద్దు ప్రాంతంపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించినందుకు గాను భారతదేశం, లెఫ్టినెంట్ జనరల్ దీపక్ సమ్మన్వార్ను ఉత్తమ యుద్ధ సేవా పతకంతో సత్కరించింది. [15] [13]