సరస్వతీ నది
From Wikipedia, the free encyclopedia
సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదీస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ (సట్లేజ్) నది ఉన్నాయి. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. సింధు లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది ఉంది. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు.
సరస్వతీ దేవి మొదట్లో ఈ నదీదేవతా మూర్తిగానే ప్రారంభమైంది, అయితే తర్వాతి కాలంలో విశిష్టమైన దేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది.[1] హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా-యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు.[2] స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు.[3]
ఋగ్వేదంలోనూ, తర్వాతి వేదాల్లోనూ ప్రస్తుత కాలంనాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనిపిస్తుంది. ఋగ్వేదంలోని నదీస్తుతి మంత్ర భాగం సరస్వతీ నదిని తూర్పున యమున, పశ్చిమాన సట్లెజ్ (శతధృ) నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంద్య, జైమినీయ బ్రాహ్మణాలు, మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావించాయి.
19వ శతాబ్ది తుదికాలం నుంచి పరిశోధకులు వైదిక సరస్వతీ నది ఇప్పటి వాయువ్య భారతదేశంలోనూ, తూర్పు పాకిస్తాన్లోనూ ప్రవహిస్తున్న ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలోనిదని భావించసాగారు. శాటిలైట్ తీసిన చిత్రాలు సరస్వతీ నదీ గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి, ఆ నది ఇప్పటి ఘగ్గర్ నదీ గమనాన్ని అనుసరించేది.[4] సింధులోయ నాగరికత విలసిల్లిన రాజస్థాన్లోని కాలిబంగన్, హర్యానాలోని బనవాలీ, రాఖీఘరి, గుజరాత్లోని ధోలవిరా, లోథాల్ ఈ నదీపరీవాహక ప్రాంతంలోనే ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.[5][6]
ఐతే, ఘగ్గర్-హక్రా ఋగ్వేదంలో ప్రత్యేకించి ప్రస్తావింపబడివుండడం, అదీ వేదకాలానికి ఎండిపోయిన నదిగా దాని ప్రస్తావన రావడంతో వైదిక సరస్వతీ నదిని ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థలో గుర్తించడం సమస్యాత్మకమైనది.[7] అన్నెట్ విల్కె మాటల్లో - వైదిక ప్రజలు వాయువ్య భారతదేశంలోకి వలసవస్తున్న కాలానికి ఘగ్గర్-హక్రా, ఎడారిలో చిన్న ప్రవాహం అయిపోయింది.[8] [9][note 1][note 2][10] ఇటీవలి భూభౌతికశాస్త్ర పరిశోధనలు ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థ, వర్షాకాలంలో వర్షపునీటితో నిండే నదుల వ్యవస్థ అనీ, వాతావరణ మార్పుల వల్ల నదులు ఇంకిపోతూండడంతో సింధులోయ నాగరికత దెబ్బతినిపోయివుండవచ్చనీ సూచిస్తున్నాయి. 4వేల ఏళ్ళ క్రితం ఆ నాగరికత అంతమవుతూన్నప్పుడే ఈ నదులకు నీటినిచ్చే వర్షరుతువు దెబ్బతినడం మొదలైంది.[11][note 3][12]
దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ లేదా హరాక్షవతి నది అయివుండవచ్చని కూడా భావిస్తున్నారు.[13] వైదిక జాతి తర్వాత పంజాబ్కు చేరినప్పుడు హరాక్షనదికి వాడిన సంస్కృత పదాన్నే ఘగ్గర్-హక్రా నదికి కూడా వాడారని అంచనావేస్తున్నారు.[13][14][note 4] ఋగ్వేదపు సరస్వతీ నది అన్నది రెండు వేర్వేరు నదులను సూచిస్తోందనీ, ఒక గ్రంథం హెల్మండ్ నదినీ, మరీ ఇటీవల నాటి 10వ మండలం ఘగ్గర్-హక్రానీ సూచిస్తూండవచ్చన్నారు.
కొందరు ఋగ్వేదాన్ని మరింత ప్రాచీనమైనదిగా చెప్తూ, సింధునదీ నాగరికతను "సరస్వతీ సంస్కృతి", "సరస్వతీ నాగరికత", "సింధు-సరస్వతీ నాగరికత", "ఇండస్-సరస్వతీ నాగరికత"గా పేర్లు మారుస్తూండడంతో,[15][16][17] 21వ శతాబ్దిలో ఘగ్గర్-హక్రా నదీ వ్యవస్థతో గుర్తించడం కొత్త ప్రాధాన్యత సంతరించుకుంది[18] సింధు-సరస్వతీ నాగరికతగా ఈ నాగరికతకు పేరు మారుస్తున్న పరిశోధకులు, సింధు లోయ నాగరికత, వైదిక సంస్కృతీ ఒకటేనంటూ [19] ఆర్య దండయాత్ర సిద్ధాంతం లేదా ఆర్యుల వలస సిద్ధాంతాన్ని తిరస్కరిస్తున్నారు.[note 5][note 6].