విఠోబా
హిందూ దేవుడు / From Wikipedia, the free encyclopedia
విఠోబా (విఠలుడు లేదా పాండురంగడు) మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరాధించే హిందూ దేవుడు. ఈయన విష్ణువు లేదా ఆయన అవతారమైన శ్రీకృష్ణుని అంశగా భావిస్తారు. విఠోబాను సాధారణంగా చేతులు వెనక్కు కట్టుకుని నిల్చుని ఉన్న నల్లటి యువకుడిగా చిత్రీకరిస్తారు. చాలా ప్రతిమల్లో రుక్మిణి కూడా తోడుగా ఉంటుంది.
విఠోబా విఠలుడు పాండురంగడు | |
---|---|
దేవనాగరి | विठोबा विठ्ठल |
అనుబంధం | కృష్ణుడు లేదా విష్ణు స్వరూపం |
నివాసం | పండరీపురం |
భర్త / భార్య | రకుమాయి |
వాహనం | గరుత్మంతుడు |
మహారాష్ట్రలోని వార్కరీ, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం. పండరీపురం లోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వార్కరీ సంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠోబా దేవునిపై అభంగాలు అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీ లోని హారతి పాటలు విఠోబా సాహిత్యంలో చెప్పుకోదగ్గవి. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శాయనీ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశిలో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి.
విఠోబా పేరు మీద, చరిత్రమీద అనేక వాదోపవాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అనేకమంది ఇండాలజిస్టులు (భారతదేశ చరిత్ర మీద పరిశోధన చేసేవారు) విఠోబా సాంప్రదాయం ఆరంభం కాకముందే ఇలాంటి విగ్రహాలు వివిధ కాలాల్లో వీరుడిగానూ, గ్రామదేవుడిగానూ, శివుడి యొక్క మరో స్వరూపంగానూ, జైన దేవుడిగానూ పూజలందుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. విఠోబా సాంప్రదాయం, ప్రధాన ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు జరుగుతున్నా 13వ శతాబ్దానికి మునుపే వాటి ఉనికిని నిర్థారించేందుకు ఆధారాలున్నాయి.